-ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిగా అధికారుల కసరత్తు
-జిల్లాలో 600 ప్రాథమిక పాఠశాలల్లో అమలు
-ప్రభుత్వానికి నివేదించిన కలెక్టర్ లోకేష్కుమార్
-ఈ ఏడాదినుంచే అమలుకు శ్రీకారం
-సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియానికి ప్రతిపాదనలు సిద్ధం
-జిల్లాలో 600 ప్రాథమిక పాఠశాలల్లో అమలు
-ప్రభుత్వానికి నివేదించిన కలెక్టర్ లోకేష్కుమార్
-కసరత్తు చేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారులు
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 6 : ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలన్నదే తెలంగాణ ప్రభుత్వం ఆశయం. మునుపటికి భిన్నంగా ఈసారి విద్యావ్యవస్థపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేటుకు ఏమాత్రం తీసిపోని విధంగా సర్కారు పాఠశాలలను రూపొందించాలని, నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులను భావిభారత మేధావులుగా తీర్చిదిద్ది, వారికి ఉజ్వలమైన భవిష్యత్ను అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లా పరిధిలోని దాదాపు ఆరు వందల సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నారు. దీనికిగాను కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్ పర్యవేక్షణలో అమలుచేయనున్న పాఠశాలలను ఎంపిక చేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు
600 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం..
ఇంగ్లిష్ మీడియంలో పాఠశాలలను నిర్వహించేందుకు తక్షణమే ప్రతిపాదనలు పంపాలని మండల విద్యాశాఖాధికారులను కలెక్టర్ లోకేష్కుమార్ ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరం నుంచే దాదాపు 600 ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన ప్రవేశ పెట్టేందుకు అనుమతులు వస్తున్నాయని తెలిపిన ఆయన విధివిధానాలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడెక్కడ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు అవసరమో బడిబాట కార్యక్రమంలో గుర్తించి వివరాలను సమర్పించాలన్నారు.
మాతృభాషకూ ప్రాధాన్యం..
ప్రస్తుత సమాజంలో ఆంగ్ల మాధ్యమానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని విధిగా ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వం ఆదేశానుసారం ఈ తరహా బోధనకు జిల్లా సర్వశిక్షా అభియాన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే తెలుగు బోధనకూ ప్రాధాన్యం తగ్గకుండా చూడాలని ప్రభుత్వం పేర్కొనటంతో ఉపాధ్యాయులను ఆదిశగా నడిపిస్తున్నారు.
600 పాఠశాలలకు అనుమతి
రవికుమార్, ఎస్ఎస్ఏ పీవో ఖమ్మం
జిల్లాలో తొలివిడతగా ఈ విద్యాసంవత్సరం నుంచే 600 పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు అనుమతులు లభించాయి. ఈమేరకు కలెక్టర్ డీఎస్ లోకేష్కుమార్ ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పించారు. ఇంగ్లిషు మీడియం అమలుకు జిల్లాలో ప్రాంతాల వారిగా పాఠశాలలను ఎంపికచేసి, ఒకట్రెండు రోజుల్లో వివరాలు అందించాలని ఆదేశాలు వచ్చాయి. బడిబాట కార్యక్రమంలో ప్రతిపాదిత పాఠశాలలను ఇప్పటికే తొంభైశాతం గుర్తించాం. మిగిలిన వివరాలను త్వరలోనే అందజేయనున్నాం.
No comments:
Post a Comment