మందుబాబులు తాగిన మద్యం విలువ ఇది..!!
-వేసవిలో బీర్లకు విపరీతంగా పెరిగిన గిరాకీ
-గత ఏడాదితో పోల్చితే రూ. 130.93 కోట్ల అధిక విక్రయాలు
-మద్యం ధరలు పెరిగినా.. జోరుగానే అమ్మకాలు
-ఎక్సైజ్శాఖకు జిల్లావ్యాప్తంగా భారీగానే రాబడి
-సంతోషం కలిగినా పార్టీ..! బాధ కలిగినా పార్టీ..!
వైరా, నమస్తేతెలంగాణ:ఎండలో తిరిగామా కూల్కూల్గా బీర్లు..! వర్షంలో తడిశామా.. హాట్హాట్గా మందు..! ఇంకేముంది..? ఏం జరిగినా పార్టీల్లో మునిగి తేలే మందుబాబులు.. ఈ నాలుగునెలల్లో ( ఫిబ్రవరి నుంచి మే ) తాగిన మద్యం విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా 344 కోట్ల 74లక్షల 52 వేల రూపాయలు..!! ఇంకోవిషయం గత ఏడాదితో పోల్చితే.. ఈ సారి మనోళ్లు ఎంత మేర ఎక్కువ తాగారో తెలుసా.. అక్షరాలా 130 కోట్ల 93 లక్షల రూపాయలు..!! ఇక వేసవి తాపం తీర్చుకునేందుకు బీరుబలులు లక్షలాది కేసులే లాగించేశారు. అంతేకాదు ఎండలు ఎంత ఉగ్రరూపం దాల్చినా.. లిక్కర్ విక్రయాలు కూడా తగ్గలేదు సుమా..! ఏదైతేనేం.. మందుబాబుల పుణ్యమా అని ఎక్సైజ్శాఖకు భారీగానే రాబడి సమకూరింది. ఆబ్కారీశాఖ ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని అధిగమించింది.
మునుపట ఇద్దరు స్నేహితులు రోడ్డుపై కలిస్తే.. అరేయ్ పదరా.. చాయ్ తాగుదాం.. అంటూ హోటల్కు పరుగు తీసేవారు. నేటి యువకులైతే ఆ పాతకాలపు బలహీనతకు ఎప్పుడో స్వస్తి పలికేశారు. ఇప్పుడు న్యూట్రెండ్ అంతా బార్ షాప్వైపే పరుగు పెడుతోంది. పెళ్లయినా, పబ్బమైనా, శుభ కార్యమైనా, ఏ సందర్భమైనా మద్యం ముట్టనిదే యువతకు పొద్దు పోవడం లేదు.
ఇటీవల అనేక రకాల వ్యాపార లావేదేవీలు కూడా మద్యం దుకాణాలే కేంద్రంగా సాగిపోతున్నాయి. ఆర్థికపరమైన లావాదేవీలైతే ఛీర్స్ కొట్టనిదే సెటిలయ్యే పరిస్థితిలేదు. ఫలితంగానే జిల్లాలో మద్యం విక్రయాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. ఇదే వీక్నెస్ ఆబ్కారీ ఖజానాకు కాసుల పంట పండిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే నెల వరకు రూ. 344,74,52 కోట్ల మద్యాన్ని జిల్లాలోని మందు బాబులు తాగేశారు. గతేడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచి మే వరకు మద్యం విక్రయాలను ఈ ఏడాది నాలుగు నెలలతో పోల్చిచూస్తే రూ.130.93 కోట్ల పైచిలుకు అదనపు విక్రయాలు సాగాయి.
ప్రధానంగా ఈ ఎడాది ఫిబ్రవరి నుంచి మే వరకు 7,55,204 బీరు కేసులు విక్రయించారు. 7,76,368 లిక్కర్ కేసులను నాలుగు నెలల్లో సేవించారు. గతేడాది నాలుగు నెలల్లో విక్రయించిన లిక్కర్ కంటే ఈ ఏడాది 3,52,506, బీర్ల కేసులు 1,69,298ను అధికంగా విక్రయించారు. దీంతో ఆబ్కారీ శాఖకు ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని అధిగమించిన ఆదాయం ఖజానాకు సమకూరుతోంది.
కోట్ల మద్యాన్ని మింగేశారు..
జిల్లాలో వేసవిలో ఈ ఏడాది రూ. 130.93 కోట్ల మద్యం విక్రయాలు పెరిగాయి. మార్చి నెలలో రూ.88.29 కోట్ల్ల మద్యం విక్రయాలు జరిగి ఐఎంఎల్ డిపో చరిత్రలో రికార్డుకెక్కింది. ఫిబ్రవరిలో రూ.83.51 కోట్లు, ఏప్రిల్లో 86.65 కోట్లు, మేలో రూ.86.28 కోట్ల మద్యాన్ని విక్రయించారు. లిక్కర్ అమ్మకాలపై ఎండ ప్రభావం కన్పించలేదు.
విచ్చలవిడి అమ్మకాలతో జేబులు గుల్ల..
జిల్లాలో మద్యం అమ్మకాలపై సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. విచ్చలవిడి ధరలకు విక్రయించడంతో మందుప్రియుల జేబులు గుల్లవుతున్నాయి. ప్రతి ఏడాది ఆదాయాన్ని బేరీజు వేసుకుంటున్న ఎక్సైజ్ శాఖ కల్తీ విక్రయాలు, ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు బెల్టుషాపుల్లో విక్రయిస్తున్న తీరును ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బజారు వ్యాపారుల జోరుకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
జిల్లాలో 143 వైన్, 48 బార్ షాపులు, మూడు క్లబ్లు నడుస్తుండగా, వీటికి సమాంతరంగా బెల్ట్ షాపులు మనుగడ సాగిస్తున్నాయి. వైన్ షాపుల్లో ఎమ్మార్పీ ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. బెల్ట్ దుకాణాల వారికి వైన్స్షాపు నిర్వాహకులు సీసాపై రూ.10 అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో బెల్టు షాపుల్లో ఒక్కో సీసాపై రూ.30 అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ ప్రభావం పేద, మధ్య తరగతి వర్గాలపై పడుతోంది
No comments:
Post a Comment