Monday, 6 June 2016

అందరి చూపు ప్రత్యామ్నాయం వైపే..

-పత్తికి గుడ్‌బై చెబుతున్న రైతన్నలు 
-అంతర్ పంటల సాగు కోసం సిద్ధం
-అవగాహన కల్పించడంలో అధికారులు బిజీ
-5వేల హెక్టార్లలో సాగుకు ఆసక్తి
కొత్తగూడెం టౌన్, జూన్ 6 : భూసారాన్ని నాశనం చేసే పత్తి పంట ఇక వేయకూడదని రైతులు నిర్ణయించుకున్నారు. గతంలో వేల ఎకరాల్లో సాగుచేసే రైతుల ఆలోచనలనే పత్తి మార్చివేసింది. పత్తికి ఎగుమతి సుంకం పెరగటం, మరోవైపు భూసారం నాశనం అవుతుండడంతో రైతులు ఉన్నట్లుండి ఇతర పంటలు వేయాలని ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు పత్తికి ప్రత్యామ్నాయం వేయాలని సూచించడంతో రైతులు కూడా అదేబాటలో పడ్డారు. దానికి బదులు అంతర్ పంటలు లేక పెసర, కందులు వేయాలని నిర్ణయించారు. 

గత ఏడాది పది నుంచి ఇరవై ఎకరాలు వేసిన రైతులు ఈ ఏడాది పది ఎకరాలకే పరిమితమవుతున్నారు. దాదాపు పత్తి పంటను వేసేందుకు రైతులు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదనే చెప్పాలి. ఈ ఏడాది ఐదువేల హెక్టార్లలో అపరాలు వేసేందుకు రైతులు సిద్ధం అయినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత ఏడాది 11వేల ఐదువందల ఎకరాల్లో రైతులు పత్తిని సాగుచేశారు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో రైతాంగం చాలావరకు నష్టపోయినట్లు తెలిసింది. మరికొన్నిచోట్ల అప్పులబాధతో రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పత్తికి ప్రత్యామ్నాయమే మేలని నిర్ణయించింది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో శాస్త్రవేత్తలను తీసుకువచ్చి రైతులకు అవగాహన కల్పించారు. పూర్తిగా అవగాహన చేసుకున్న రైతులు అంతర్‌పంటలకే మొగ్గు చూపినట్లు తెలిసింది. ఇంతకాలం నష్టపోయిన రైతులు కందులు, మినుములు, పెసర్లు, నువ్వులు వేసేందుకు రెడీ అవుతున్నారు. విత్తనాలు ఎప్పడు వస్తాయా ఆశగా ఎదురుచూస్తున్నారు.

అవగాహన కల్పించడంలో అధికారులు బిజీబిజీ...
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించేందుకు అధికారులు బిజీ అయిపోయారు. కొత్తగూడెం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రైతులతో మాట్లాడి పంటల ఉపయోగాలు తెలిపారు. అందుకు సంబంధించిన శాస్త్రవేత్తల ద్వారా సమగ్రంగా వివరించారు. తెగుళ్లు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించి రైతుల సమస్యలను నివృత్తిచేశారు. 

కొత్తగా సోయా చిక్కుడు వేస్తే ఏమేరకు లాభం వస్తుంది అనేది రైతులకు తెలియజేయడంలో ఒకడుగు ముందుకు ఆ పంట వేస్తున్నారు. రైతుల సమస్యలు దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్ సర్కార్ కూడా ప్రత్యామ్నాయ పంటలకు ముందుగానే విత్తనాలు సిద్ధం చేసింది. నేడో రేపో అవి మండల కేంద్రాలకు రాబోతున్నాయి.

ఈసారి చెరువులు కూడా ఉన్నాయి :దేవరకట్ట శ్రీనివాస్, రేగళ్ల
వ్యవసాయానికి ఈసారి చెరువులు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రైతులకు ఇక చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. పత్తి వల్ల ఎట్లా నష్టపోతున్నాం. వేరే పంటలు మార్చమని చెప్తున్నారు. మన కోసమే మనం మారాలి. అందువల్ల కందులు, పెసర్లు వేస్తాను. అదే చాలు.

అన్నీ తెలిశాక ఎందుకు వేస్తాం పత్తి :శంకర్, రైతు మైలారం
పత్తి వల్ల నష్టం వచ్చింది. కొనుగోలు లేనప్పుడు వేసి ప్రయోజనం ఏమిటీ.. అందువల్ల ఈ ఏడాది అపరాలు వేస్తాను. ఐదు ఎకరాల్లో కందులు, పెసర్లు వేయాలనుకుంటున్నాను. విత్తనాలు సకాలంలో వస్తే మంచిది. అధికారులు చెప్తున్నారు. ఆసమయానికి విత్తనాలు లేవంటే మాకు ఇబ్బంది అవుతుంది. 

అన్నిచోట్ల మంచి స్పందన ఉంది :కరుణశ్రీ, ఏడీఎ కొత్తగూడెం
పత్తికి బదులు ప్రత్యామ్నాయం వేయాలని రైతులకు అవగాహన కల్పించాం. చాలా మంది రైతులు ముందుకువచ్చారు. పెసర్లు తెప్పించమన్నారు. అంతర్‌పంటలు వేస్తామని చెప్పారు. అందరి రైతులకు పత్తి గురించి జిల్లా అధికారులు కూడా చెప్పారు. సకాలంలో విత్తనాలు అందిస్తాం. సోయాచిక్కుడు వెయ్యమని చెప్పాం. మార్కెటింగ్ బాధ్యత మాదే అని కూడా చెప్తున్నాం. కేవలం నల్లరేగడి నేలల్లో వేయాలని తెలిపాం. మంచి ఫలితాలు వస్తాయి.

అపరాలు ఐదు ఎకరాలు వేస్తున్నా : రామారావు, రైతు, విద్యానగర్ చుంచుపల్లి
గత ఏడాది పత్తి వేశాను. నష్టం వచ్చింది. మళ్లీ అదే తప్పు చేస్తే అప్పులు తీర్చలేను. భూమిలో దమ్ములేనపుడు పంటలు మార్చాలి అందువల్ల పత్తికి బదులు ప్రత్యామ్నాయం వేస్తున్నాను. అంతర్ పంటవేస్తే రెండువైపులా ఉపయోగపడుతుంది. అధికారులు కూడా అదే చెప్పారు. రసాయన ఎరువుల వల్ల మునిగిపోతున్నాము.

No comments:

Post a Comment